మల్కాజ్గిరి జిల్లా,మన వార్త ప్రతినిధి అంతోని : మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాలగూడా లో అర్ధరాత్రి షాపులపై బుల్డోజర్ సహాయంతో షట్టర్లు తొలగింపు.అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని,తన స్వంత భవనంలో పనిచేస్తున్న 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు.ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఈ షాపుల్లో కొంతమంది 15 ఏళ్లకుపైగా వ్యాపారం చేస్తున్నవారు.ఇటీవల బిల్డింగ్ యజమాని వారిని షాపులు ఖాళీ చేయాలని కోరారు. దీనిపై కిరాయిదారులు స్పందిస్తూ,మేము ఇక్కడ చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాం, దయచేసి కొంత సమయం ఇవ్వండి అని కోరారు. అయితే, యజమాని మాటలకు ఒప్పుకున్నట్లు కనిపించి, అర్ధరాత్రి వేళ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా షాపుల షట్టర్లను తీసేసారు.
ఈ దౌర్జన్య చర్యతో షాప్ యజమానులు తీవ్రంగా ఆగ్రహించారు. తమ వద్ద ఉన్న సరుకులు, డబ్బులు అన్ని గల్లంతయ్యాయని ఆరోపించారు. వెంటనే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో అలా నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయడమేమిటి? మేము ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తాం. కానీ ముందే చెప్పకుండా ఇలా చెయ్యడం అన్యాయం” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా తన ఇష్టానుసారం వ్యవహరించిన బిల్డింగ్ యజమాని చర్యపై బాధితులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడిది స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.